Telangana: రేపటితో ముగియనున్న లోక్సభ ఎన్నికల ప్రచారం
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది.
By Srikanth Gundamalla Published on 10 May 2024 10:29 AM IST
Telangana: రేపటితో ముగియనున్న లోక్సభ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. శనివారంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తిరగని ప్రాంతాలను ఒకసారి రీషెడ్యూల్ చేసుకుంటున్నారు.
మార్చి 16వ తేదీన పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలో ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక నాఇనేషన్ల దాఖలుకు 25వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జూన్ 4వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా ప్రచారానికి తెరపడనుంది. శనివారం సాయంత్రం 6 గంటల వరకే ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది. నిజానికి సాయంత్రం 5 గంటల వరకే ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. కానీ.. ఎండల తీవ్రత కారణంగా ప్రచార సమయాన్ని పొడిగించారు. అదే విధంగా రాజకీయ పార్టీల విన్నపం మేరకు పోలింగ్ సమయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పొడిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంట వరకు ఓటు వేయవచ్చు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ సమయానికి 48 గంటల ముందు వరకే ప్రచారం నిర్వహించుకోవాలి.
ప్రతి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించడం అభ్యర్థులకు సాధ్యపడలేదు. దాంతో.. పార్టీ ప్రతినిధులు, స్థానిక నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగించారు. నేరుగా ప్రచారంలో అభ్యర్థులు పాల్గొనకపోవడం వల్ల ఓటింగ్పై ఏమైనా ప్రచారం చూపుతుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పోలింగ్ను పెంచేందుకు మాత్రం ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.