రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న శతాబ్దాల నాటి హజ్రత్ సయ్యద్ తాజుద్దీన్ ఖాజా బాగ్ సవార్ దర్గా తరలింపుపై తెలంగాణ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. లంచ్ మోషన్ ద్వారా దాఖలైన ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ బి. విజయ్సేన్ రెడ్డి, దర్గాను ప్రస్తుత స్థానం నుండి తరలించవద్దని ఆదేశించారు. మహమ్మద్ నాజిమా అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్లో.. అధికారులు అక్రమంగా ఫెన్సింగ్ వేసి, బారికేడ్లు అడ్డుపెట్టి దర్గాకు వెళ్లే దారిని మూసివేశారని సవాలు చేశారు.
12వ శతాబ్దానికి చెందిన ఈ దర్గా దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగి ఉందని, వేములవాడ రాజన్న ఆలయంతో కలిసి మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది జీషన్ అద్నాన్ మహమూద్ పేర్కొన్నారు. దర్గా ముతవల్లీకి దానిని తరలించే అధికారం లేదని, అటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం కేవలం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు మాత్రమే ఉంటుందని న్యాయవాది వాదించారు.
జిల్లా కలెక్టర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి (EO), ఎస్పీ ఇచ్చిన వివరణలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. దర్గాను కూల్చివేయడం, మార్చడం లేదా తరలించడం వంటి బలవంతపు చర్యలేవీ చేపట్టవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని స్పష్టం చేస్తూ కేసును వాయిదా వేసింది.