'కాంగ్రెస్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయండి'.. పోలీసులకు టీఎస్‌ హైకోర్టు ఆదేశం

Telangana High Court asks police to file counter on Cong leader’s habeas corpus plea. హైదరాబాద్‌: కాంగ్రెస్‌ వార్‌రూమ్‌పై మంగళవారం దాడులు నిర్వహించి ముగ్గురిని అక్రమంగా

By అంజి  Published on  15 Dec 2022 3:30 PM GMT
కాంగ్రెస్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయండి.. పోలీసులకు టీఎస్‌ హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ వార్‌రూమ్‌పై మంగళవారం దాడులు నిర్వహించి ముగ్గురిని అక్రమంగా నిర్బంధించడంపై కాంగ్రెస్‌ నేత ఒకరు దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌కు కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు గురువారం రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి తమను తక్షణమే కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.

దాడి తర్వాత ఇషాన్ శర్మ, తాతినేని శశాంక్, మంద ప్రతాప్‌లను పోలీసులు అక్రమంగా తీసుకెళ్లారని పిటిషనర్ ఆరోపించారు. అలాగే అక్రమంగా నిర్బంధించిన ముగ్గురికి రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని మల్లు రవి కోరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సర్వేలు, విశ్లేషణలు, ఎన్నికల ప్రచారం, డిజిటల్ మీడియా నిర్వహణ వంటివాటి ద్వారా ముగ్గురు వ్యక్తులు రాజకీయ నిర్వహణ సేవలందిస్తున్నారని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. అయితే ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఎ కింద నోటీసులు ఇచ్చిన తర్వాత ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించినట్లు తెలిసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు విచారణను వాయిదా వేసింది.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఆయన కుమార్తె కె. కవిత తదితరులను అవమానపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారనే ఫిర్యాదులపై విచారణలో భాగంగా మంగళవారం రాత్రి హైదరాబాద్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ల్యాప్‌టాప్‌లు, సీపీయూలు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పలు మార్ఫింగ్ వీడియోలను కనుగొన్నారు. నిందితులు 'తెలంగాణ గళం', 'అపన్న హస్తం' పేరుతో సోషల్ మీడియాలో కించపరిచే పోస్టులు చేస్తున్నారు.

ముగ్గురు వ్యక్తుల నేరాంగీకారాల ఆధారంగా సునీల్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. అతను పరారీలో ఉన్నాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. అది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యాలయం అని పోలీసులకు తెలియదని పోలీసు అధికారి తెలిపారు. ఆవరణలో కార్యాలయం పేరు, బోర్డు లేవని తెలిపారు. నిందితులు మాదాపూర్‌లోని మైండ్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్ భవనంలో రహస్యంగా పనిచేస్తున్నారని, అవమానకరమైన పోస్ట్‌లపై వచ్చిన ఫిర్యాదులపై విచారణలో భాగంగా సైబర్ క్రైమ్ సాధనాలను ఉపయోగించి వారిని గుర్తించామని అధికారి తెలిపారు.

నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 469 (పరువుకు హాని కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ), 505 (2) (వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా దుష్ప్రవర్తనను సృష్టించడం లేదా ప్రోత్సహించే ప్రకటనలు) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌తో పాటు, మరో నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పోలీసుల చర్య ప్రతిపక్ష పార్టీ నుండి తీవ్ర ప్రతిస్పందనను రేకెత్తించింది. ఇది 'ప్రజాస్వామ్యంపై దాడి' అని పేర్కొంది. ఈ దాడిని నిరసిస్తూ ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

Next Story