Telangana: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌ అందించారు.

By Srikanth Gundamalla  Published on  9 Oct 2023 2:17 AM GMT
telangana govt, health insurance,  employees, pensioners,

 Telangana: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌ అందించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయిస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. నూతన ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ అమలుకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు.. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. దీని అమలు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌ (ఈహెచ్‌సీటీ) ఏర్పాటుకు ఆదివారం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. ప‌థ‌కం అమ‌లుకు ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా జ‌మ చేయాల‌ని చెప్పింది. పథకం అమలు విధివిధానాలను ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు.

రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షన్‌దారుల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం అమలు చేయాలని మొదటి పీఆర్‌సీ నివేదిక ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. నివేదిక ప్రతిపాదించిన మేరకు ఆరోగ్య పథకానికి తమ మూల వేతనంలో ఒక శాతం విరాళం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలోనే చెప్పారు. దీనిపై సీఎం కేసీఆర్ కేసీఆర్ ఆదేశాలతో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవో పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి ప్రతిపాదనలతో ప్రభుత్వానికి నివేదిక అందించారు. సీఎం కేసీఆర్ దీనిని ఆమోదించడంతో ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఆరోగ్య పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు... వారి కుటుంబ కుటుంబ సబ్యులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇక ఈ నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లకు లాభం చేకూరుతుందని వారు పేర్కొన్నారు.

Next Story