రేషన్‌కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు

By Srikanth Gundamalla  Published on  16 Sep 2024 11:21 AM GMT
రేషన్‌కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. సోమవారం కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేషన్‌ కార్డుల జారీపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సబ్‌ కమిటీ భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు తెలిపారు.

ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డు విధివిధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు అర్హులు ఎవరనేదానిపై వచ్చే భేటీలో నిర్ణయిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారనేదానిపై అధ్యయనం చేస్తున్నామని అన్నారు మంత్రి ఉత్తమ్‌. రేషన్ కార్డుల నిబంధనలు ఎలా ఉండాలని పార్టీలకు లేఖ రాశామన్నారు. కొంత మంది ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు చేశారనీ.. ఇలా వచ్చిన సూచనలన్నీ సమావేశంలో చర్చించామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు.

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం 49వేల రేషన్ కార్డులను మాత్రమే ఇచ్చిందనీ.. అవి కూడా బైఎలక్షన్ వచ్చిన నియోజకవర్గాల్లోనే పంపిణీ చేశారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులను రాష్ట్రమంతా ఇవ్వాలని విమర్శలు చేశారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా రేషన్‌ కార్డులు జారీ చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 21వ తేదీన మరోసారి కేబినెట్ సబ్‌కమిటీ భేటీ ఉంటుందనీ.. ఈ నెలాఖరులోగా రిపోర్టు ఇస్తుందని మంత్రి ఉత్తమ్ చెప్పారు .అక్టోబర్‌ నుంచి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు.

Next Story