హైదరాబాద్: కౌమార బాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి పౌష్ఠికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేడు 'ఇందిరమ్మ అమృతం' పథకాన్ని ప్రారంభించనుంది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న బాలికలకు చిరుధాన్యాలతో తయారైన పట్టీలను అందిస్తారు.
పల్లీలు, రాగులు, సజ్జలు, అరికెలు, సామలు, కొర్రలు, వరిగెలు వంటి వాటితో తయారైన చిక్కీలు ఇస్తారు. దీని ద్వారా 50,269 మంది బాలికలకు లబ్ధి చేకూరనుంది. కిశోర బాలికల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు వయస్సుకు తగిన బరువు పెరిగేలా చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పల్లి, చిరుధాన్యాలతో తయారైన పట్టీలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా కౌమార బాలికలకు ఉచితంగా పంపిణీ చేయనుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా పొందిన అనుభవాల ఆధారంగా పథకాన్ని ఇతర జిల్లాలకూ విస్తరింపజేస్తారు. చిరుధాన్యాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలుండటంతో వాటితో తయారు చేసిన పట్టీలను వారికి నెలకు 30 చొప్పున అందజేస్తారు. వీటి తయారీ, నిల్వలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం పరిశీలనకు కమిటీ కూడా ఏర్పాటు చేశారు.