హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. జూన్ 10 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే జూన్ 15న తర్వాత రాజీవ్ యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్ ఉంటుందని తెలిపారు. అక్టోబరు 2 నాటికి 5 లక్షల మందికి దశల వారీగా లబ్ధి చేకూరుతుందన్నారు. తొలి విడతలో రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి సీతక్క తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న అన్ని నియోజకవర్గాల్లో రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. యువతకు స్వయం ఉపాధి అందించే రాజీవ్ యువ వికాసం పథకంను ఈ ఏడాది ₹8,000 కోట్ల వ్యయంతో జూన్ 2 న ప్రారంభం చేసి అక్టోబర్ 2వ తేదీ (గాంధీ జయంతి) నాటికి 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.
ఇది ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం యువతకు అందిస్తున్న భరోసా అని, గత 10 ఏళ్ల నిర్లక్ష్యాన్ని పరిహరిస్తూ, ఒక్కే సంవత్సరంలో 8,000 కోట్లు వెచ్చిస్తూ చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, సంక్షేమ శాఖల కార్పొరేషన్ చైర్మన్లు సమన్వయంతో యువత ఎదుగుదలకు తోడుగా నిలబడాలన్నారు.