హైదరాబాద్: సర్కార్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీజీపీఎస్సీ, పోలీసు, వైద్య, గురుకుల నియామక సంస్థల ద్వారా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయనుంది. ఏప్రిల్ నెలాఖరు కల్లా ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ మొదలు కావాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదట వివిధ శాఖల్లోని ఖాళీలను గుర్తించిన తర్వాత, నియామకానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయనుంది.
దాదాపు 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడనున్నట్టు ప్రభుత్వ వర్గాల అంచనా. ప్రతి ఏటా ఉద్యోగాల భర్ఈకి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే 2024 - 25కు సంబంధించిన జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేశారు. అయితే మధ్యలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ రావడంతో కొత్త నోటిఫికేషన్లను జారీ చేయలేదు. దాంతో ఆ జాబ్ క్యాలెండర్ ప్రక్రియ ఆగిపోయింది.
తాజాగా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీపై దృష్టి పెట్టింది. వచ్చే నాలుగైదు రోజుల్లో అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలను గుర్తించనున్నారు. వైద్య, ఆర్టీసీ విభాగాల్లో దాదాపు 10 వేల పోస్టుల వరకు ఉంటాయని అంచనా. ఇంజినీరింగ్ విభాగంలోనూ 3 వేల వరకు ఖాళీలు ఉన్నట్టు సమాచారం. గురుకుల, ప్రభుత్వ టీచర్ల భర్తీతో పాటు.. గ్రూప్-1 ప్రకటన జారీకి ప్రభుత్వం పోస్టులను గుర్తిస్తోంది.