హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) గడువును మరోసారి పొడిగించింది. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన రాయితీ 25 శాతం కొనసాగుతుందని పేర్కొంది. మే 31తో గడువు ముగియగా అధికారులు కోరడంతో ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో స్థలాల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వంలోనే అనుమతి ఇవ్వగా దాదాపు 25 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు.
దీని వేగాన్ని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం మినహాయింపు ఇచ్చింది. మొదట ఈ ఏడాది మార్చి వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత వరుసగా గడువును పొడిగించుకుంటూ వస్తున్నారు. కాగా ఎల్ఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టిన ఒక పథకం. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం, అనధికారికంగా ఏర్పడిన లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించడం, తద్వారా ప్లాట్ యజమానులకు చట్టపరమైన గుర్తింపు కల్పించడం. దీని ద్వారా ప్లాట్ యజమానులు తమ ప్లాట్లను అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మరియు ఆస్తి హక్కులను పొందేందుకు అవకాశం ఉంటుంది.