హైదరాబాద్: ఆలయాల్లో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న అర్చక ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం అర్చక ఉద్యోగులకు గ్రాట్యుటీని పెంచుతున్నట్టు ప్రకటించింది. రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకు గ్రాట్యుటీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో 13,700 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు అర్చక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తూ మంత్రి కొండా సురేఖ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో పాటు అంతిమ సంస్కారాల ఖర్చులకు ఇచ్చే రూ.20 వేలను రూ.30 వేలకు పెంచినట్టు మంత్రి పేర్కొన్నారు.
సోమవారం నాడు సచివాలయంలో అర్చక ఉద్యోగల సంక్షేమ నిధి పోస్టర్ ఆవిష్కరణ తర్వాత మంత్రి మాట్లాడారు. అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణాంతరం లేదా రిటైర్మంట్ తర్వాత గ్రాట్యుటీ ఇస్తారని తెలిపారు. ధూపదీప నైవేద్య అర్చకులకు మరణానంతరం చెల్లించే గ్రాట్యుటీని నిర్ధారించామని చెప్పారు. ఎక్స్గ్రేషియా, అంతిమ సంస్కారాల ఖర్చుల చెల్లింపులకు ఈ నిధు ఉపయోగపడుతుందన్నారు.
ఈ నిధి కింద ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్ మెంట్, వివాహ నిమిత్త పథకం, ఉపనయన పథకం, గృహ నిర్మాణ, కొనుగోలు, మరమ్మతుల నిమిత్త పథకం, విద్యా పథకం, విధులు నిర్వహించలేని వికలాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సహాయ పథకం అందజేయడం జరుగుతుందన్నారు. గ్రాట్యూటీ సదరు ఉద్యోగి బ్యాంకు ఖాతాలో ఏక మొత్తంలో వారి సర్వీసు కాలానికి లోబడి చెల్లిస్తామని తెలిపారు. ఈ అంశంపై ప్రాంతీయ, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు అర్చక, ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.