హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. 2 శాతం డీఏ (డియర్ అలవెన్స్) పెంచుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ నిర్ణయంతో 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచే ఉద్యోగులకు వర్తించనుంది. దీంతో ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో ప్రజల కోసం పని చేయాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలని భట్టి విక్రమార్క అన్నారు.
భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం, విద్యుత్ సిబ్బంది ఒక ఆదర్శ కుటుంబంలా పనిచేస్తాయన్నారు. డీఏ విడుదల సందర్భంగా ప్రజా భవన్కు ట్రాన్స్కో మేనేజ్ మెంట్, సభ్యులు వెళ్లారు. డీఏ విడుదల అయిన సందర్భంగా జేఏసీ తరఫున, ట్రాన్స్ కో యాజమాన్యం, డిస్కంలకు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. డీఏ విడుదలతో విద్యుత్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.