సంక్రాంతి తర్వాత ఎంపీ అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్రెడ్డి
గాంధీభవన్లో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఐదు అంశాలే ఎజెండాగా చర్చ కొనసాగింది.
By Srikanth Gundamalla Published on 18 Dec 2023 4:57 PM IST
సంక్రాంతి తర్వాత ఎంపీ అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్రెడ్డి
గాంధీభవన్లో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఐదు అంశాలే ఎజెండాగా చర్చ కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపైనా ఈ సమావేశంలో చర్చలు జరిపారు. అలాగే అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా పీఏసీ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్మాణం చేశారు.
పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మనకోసం పనిచేసిన అందరికీ అందాల్సిందే అని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అనే తేడా లేకుండా అభివృద్ధి జరగాలని చెప్పారు. కాంగ్రెస్ బీఫామ్ అందుకున్న నాయకుడి ద్వారానే పథకాలు ప్రజలకు అందాలని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు సంతృప్తి చెందేలా పనిచేద్దామని ముఖ్యనేతలకు సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. అయితే.. గ్రామ సభల్లోనే లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది కాబట్టి.. జిల్లా ఇంచార్జ్లకు పెత్తనం ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల బాధ్యత అంతా ఇంచార్జ్లదే అని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికలపైనా చర్చించిన పీఏసీ సమావేశంలో.. రేవంత్రెడ్డి అభ్యర్థుల ఎంపిక గురించి మాట్లాడారు. సంక్రాంతి తర్వాత ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు నెల రోజల ముందే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మరోవైపు నెల రోజుల్లోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ సీట్లను అధిష్టానం చూసుకుంటుందని రేవంత్రెడ్డి చెప్పారు. నామినేటెడ్ పదవుల ఎంపికను ఇంచార్జ్ థాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు చూసుకుంటారని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై భట్టి విక్రమార్క వివరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టనున్నట్లు పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ వెల్లడించారు.