నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
By - అంజి |
నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో పలు కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అసెంబ్లీ కాంప్లెక్స్లోని పునరుద్ధరించిన లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం ముందు 'తెలంగాణ తల్లి' విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ప్రారంభమవుతాయి.
ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం గవర్నర్ను కలిసి, ప్రభుత్వం తరపున బడ్జెట్ సమావేశాలకు అధికారికంగా ఆహ్వానించారు. ఈ భేటీలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం వారు సభకు హాజరుకానున్నారు.
గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశమై, ఈ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మార్చి 20వ తేదీన అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరియు కొత్త ప్రాజెక్టులపై ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు జరిగే అవకాశం ఉంది.