పీవీ కుమార్తెకు కరోనా..!

Surabhi Vani Devi Tested Covid Positive. దివంగత భారత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి కరోనా బారిన పడ్డారు.

By Medi Samrat  Published on  29 March 2021 7:41 AM GMT
Surabhi Vani Devi Tested Covid Positive

దివంగత భారత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో బాగా వినిపించిన పేరు అయ్యింది. ఆమె హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఓ వైపు విజయాన్ని అందుకుని.. తన విధులు నిర్వర్తించాలని భావిస్తూ ఉన్న సమయంలో సురభి వాణీదేవి కరోనా బారిన పడ్డారు. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులో తనకు కోవిడ్‌ నిర్ధారణ అయ్యిందని ఆమె ఆదివారం రాత్రి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, ఇటీవల తనను కలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హోం ఐసోలేషన్‌తో పాటు అవసరమైతే కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఈనెల 20న వాణి దేవి సీఎం కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్-రంగా రెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన అనంతరం కృతజ్ఞతలు తెలిపేందుకు కేసీఆర్‌ను కలిశారు. దీంతో ఆమె కలిసిన వారు కూడా ఐసోలేషన్ లో ఉంటే మంచిదని వైద్యులు కూడా సూచిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువవుతూ ఉన్నాయి.


తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 403 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. ఒక్క‌రోజులో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 313 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,742 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,00,469 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,690గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,583 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,815 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.


Next Story