బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి చిక్కులు

బీఆర్ఎస్ సీనియర్ నేత, పటాన్ చెరు గూడెం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 2014లో పటాన్ చెరు

By అంజి  Published on  7 Jun 2023 6:12 AM GMT
Supreme Court,  BRS MLA, Gudem Mahipal Reddy, Patancheru

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి చిక్కులు

బీఆర్ఎస్ సీనియర్ నేత, పటాన్ చెరు గూడెం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 2014లో పటాన్ చెరు సమీపంలోని ఓ పరిశ్రమపై దాడి చేసిన ఘటనలో మహిపాల్ రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ అప్పట్లో సంగారెడ్డి జిల్లా కోర్టు రెండున్నరేండ్ల జైలు శిక్ష తో పాటు రూ.2,500 జరిమానా విధించింది. దీన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. జిల్లా కోర్టు తీర్పు పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆయనకు ఊరట లభించింది. అప్పటి నుంచి ఈ కేసులో స్టే కొనసాగుతూనే ఉంది. హైకోర్టు ఇచ్చిన స్టేపై ఎంఏ.ముఖిమ్ అనే న్యాయవాది ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే సంగారెడ్డి కోర్టు శిక్ష విధించిందని, ఈ పరిస్థితుల్లో హైకోర్టు ‘స్టే’ ఇవ్వడం తగదని పేర్కొంటూ న్యాయవాది మోఖీం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారణకు స్వీకరించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్, ప్రతివాదికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ తేదీని మాత్రం ఇంకా నిర్ణయించలేదు.

Next Story