మునుగోడులో తీవ్ర ఉద్రిక్తత.. ఈటల కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. వీడియో

Stones pelted at Eatala Rajender’s convoy. నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండగా మునుగోడు

By అంజి  Published on  1 Nov 2022 9:47 AM GMT
మునుగోడులో తీవ్ర ఉద్రిక్తత.. ఈటల కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. వీడియో

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండగా మునుగోడు మండలం పలివెల వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై అగంతకులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. తన కాన్వాయ్‌పై దుండగులు రాళ్లతో దాడి చేసినప్పుడు వారు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోయారని ఈటల పోలీసులపై మండిపడ్డారు.

టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అదే సమయంలో బీజేపీ శ్రేణుల దాడిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ జగదీశ్‌కు గాయాలయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. పలివెల ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం వెంటనే అదనపు బలగాలను గ్రామానికి పంపాలని ఆదేశాలు జారీ చేసింది.

మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్నందున భద్రతను పటిష్టం చేయాలని పోలీసు శాఖను ఈసీ ఆదేశించింది. ఈ ఘటనపై మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ.. ఓటమికి భయపడి బీజేపీ ఇలాంటి దారుణమైన దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు సహనం కోల్పోవద్దని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.




Next Story