హైదరాబాద్: 2036 ఒలింపిక్స్లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటేలా స్పోర్ట్స్ పాలసీని రూపొందించినట్టు క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం 8 నుంచి 10 ఏళ్ల విద్యార్థుల్లో క్రీడాకారులను గుర్తించి ఒలింపిక్స్లో మెడల్స్ తెచ్చేలా వారిని తీర్చిదిద్దుతామని తెలిపారు. క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. సోమవారం నాడు హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో 39వ ఎడిషన్ ఒలింపిక్ డే రన్ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి మాట్లాడుతూ.. యువత ఇంటర్నేషనల్ స్థాయిలో రాణించేలా మెరుగైనా స్పోర్ట్స్ పాలసీని తీసుకురానున్నట్టు తెలిపారు. స్పోర్ట్స్ రంగానికి సీఎం రేవంత్ అత్యధిక నిధులు కేటాయించారని తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ వెయిటేజీ పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వివిధ ప్రోత్సాహకాలతో రూపొందించిన స్పోర్ట్స్ పాలసీకి నిన్న మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.