తెలంగాణ మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణానికి 'స్మార్ట్ కార్డ్స్'!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకంలో త్వరలో కీలక మార్పు రానుంది.
By - అంజి |
తెలంగాణ మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణానికి 'స్మార్ట్ కార్డ్స్'!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకంలో త్వరలో కీలక మార్పు రానుంది. మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం, పారదర్శకత కోసం చిప్తో కూడిన స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఆధార్ కార్డు ఆధారంగా సాగుతున్న ఈ ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
ఈ స్మార్ట్ కార్డుల రూపకల్పన కోసం ప్రభుత్వం ఐదు కీలక విభాగాల నుండి డేటాను సేకరిస్తోంది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (TGTS), సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG), స్వయం సహాయక సంఘాలు (SHG), విద్యాశాఖ మరియు ఆరోగ్య శాఖల నుంచి లబ్ధిదారుల వివరాలను క్రోడీకరిస్తున్నారు. ఈ డేటా ఆధారంగా అర్హులైన ప్రతి మహిళకు ఖచ్చితమైన సమాచారంతో కూడిన కార్డులను అందజేస్తారు. దీనివల్ల ప్రయాణాల సంఖ్యను ఖచ్చితంగా లెక్కించే అవకాశం ఉండటమే కాకుండా, ఆర్టీసీకి చెల్లించాల్సిన రీయంబర్స్మెంట్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం పారదర్శకంగా అంచనా వేయగలదు.
గణాంకాల పరంగా చూస్తే, డిసెంబర్ 2023లో పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 283.94 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ప్రతిరోజూ సగటున 34.37 లక్షల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటుండటం విశేషం. ఈ పథకం రాకముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల శాతం 40 ఉండగా, ఇప్పుడది 67.39 శాతానికి పెరిగింది. ఈ స్మార్ట్ కార్డుల జారీ కోసం డేటా సేకరణ మరియు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఇప్పటివరకు సుమారు 9,222 కోట్ల రూపాయల ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేవలం ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, మహిళల ప్రయాణ సరళిని అర్థం చేసుకుని, రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో అదనపు బస్సులను ఏర్పాటు చేయడానికి కూడా ఈ స్మార్ట్ కార్డ్ విధానం దోహదపడనుంది.