తెలంగాణ స్థానికతపై హైకోర్టు తీర్పు..సుప్రీంకోర్టులో విద్యార్థుల పిటిషన్

తెలంగాణ లోకల్ అభ్యర్థి కోటా నిబంధనలపై పోర్లపర్త సార్థిరెడ్డి నేతృత్వంలో 27 మంది తెలంగాణ విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

By -  Knakam Karthik
Published on : 21 Sept 2025 9:10 PM IST

Telangana, MBBS, BDS Students, Supreme Court, local candidate quota, TG High Court

ఢిల్లీ: తెలంగాణ లోకల్ అభ్యర్థి కోటా నిబంధనలపై పోర్లపర్త సార్థిరెడ్డి నేతృత్వంలో 27 మంది తెలంగాణ విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులో వారిని MBBS/BDS ప్రవేశాల 85% రాష్ట్ర కోటాలో ‘లోకల్ అభ్యర్థులుగా’ గుర్తించకుండా నిరాకరించిన నేపథ్యంలో ఈ విజ్ఞప్తి దాఖలు చేశారు. ఈ పిటిషన్లు అడ్వకేట్-ఆన్-రికార్డు జి.ఎన్. రెడ్డి ద్వారా దాఖలయ్యాయి. 2025 సెప్టెంబర్ 17న హైకోర్టు W.P. Nos. 27925 మరియు 28076 లో ఇచ్చిన ఆదేశాలను వారు సవాలు చేస్తున్నారు. హైకోర్టు ప్రభుత్వం చేసిన సవరణలను సమర్థిస్తూ, విద్యార్థుల వాదనలను తిరస్కరించింది.

2017లో తెచ్చిన తెలంగాణ మెడికల్ & డెంటల్ కాలేజీల ప్రవేశ నిబంధనల్లోని రూల్ 3(a)ను 2024 జూలై 19న (జి.ఓ. 33) సవరించారు. అందులో నాలుగు వరుసగా విద్యా సంవత్సరాలు తెలంగాణలో చదివి ఉండాలి లేదా నివాసంతోపాటు అర్హత పరీక్ష తెలంగాణలో రాసి ఉండాలని షరతు పెట్టారు. 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం, ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 8న జి.ఓ. 150 జారీచేసి, సర్వీస్ కారణాల వల్ల బయట చదివిన ప్రభుత్వ ఉద్యోగులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, డిఫెన్స్/సిఏపిఎఫ్ సిబ్బంది, పీఎస్యూల ఉద్యోగుల పిల్లలకు మినహాయింపు కల్పించింది.

కానీ సాధారణ తెలంగాణ నివాసితులు — రైతులు, కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందేవారి పిల్లలు — బయట IX–XII తరగతులలో కొంత చదివిన వారు ఈ మినహాయింపులో చేరలేదు. వారికి ఇది అన్యాయం అవుతుందని, వెనుకబాటు ప్రభావం చూపుతుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లకు విరుద్ధమని విద్యార్థులు వాదిస్తున్నారు.

వారి డిమాండ్లు:

కేవలం ‘నాలుగు వరుసగా విద్యా సంవత్సరాలు’ Telanganaలో చదవలేదనే కారణంతో తిరస్కరించరాదు;

ప్రభుత్వం వద్ద ఉన్న వారి విజ్ఞప్తిపై నిర్ణయం తక్షణం, నిర్దిష్ట కాలంలో తీసుకోవాలి;

ప్రస్తుత కౌన్సెలింగ్ రౌండ్లలో తాత్కాలికంగా పాల్గొననివ్వాలి.

హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుడు రీతిలో అర్థం చేసుకుందని, వాస్తవానికి ప్రభుత్వం తగిన విధంగా సవరించే అవకాశం ఇంకా ఉందని విద్యార్థులు అంటున్నారు. ప్రస్తుతం కౌన్సెలింగ్ జరుగుతున్నందున అత్యవసరంగా ఈ విషయం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశముంది.

Next Story