హైదరాబాద్: రాష్ట్రంలోని ఇళ్లు లేని పేదలందరికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మునిసిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లిలో 'సమీకృత భూ భారతి' పోర్టల్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వం 'ధరణి' పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, అందుకే ఆ పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపి, పారదర్శకమైన భూ సంస్కరణల కోసం 'భూ భారతి'ని తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. ఈ కొత్త విధానం ద్వారా భూ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తెస్తున్నామని, రిజిస్ట్రేషన్ సమయంలోనే 'భూదార్' నంబర్, పక్కా కొలతలతో కూడిన మ్యాప్లను అందిస్తామని వెల్లడించారు.
'అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు కేటాయిస్తాం. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో 45 రోజుల పరిశీలన తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా ఈ పోర్టల్ను అమలు చేస్తాం. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సాదాబైనామా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం. సాగులో ఉన్న వారి సమ్మతితో వారికే పట్టాలు ఖరారు చేస్తాం' అని మంత్రి పేర్కొన్నారు. శాసనసభలో బీఆర్ఎస్ నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారని మంత్రి మండిపడ్డారు.