హైదరాబాద్: పార్శిల్ సేవలను ఆధునీకరించే లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. దేశంలోనే మొదటిసారిగా డోర్-టు-డోర్ (ఇంటి వద్దకే) పార్శిల్ బుకింగ్ మరియు డెలివరీ సౌకర్యాన్ని కల్పించేలా 'రైల్ పార్శిల్ యాప్'ను సిద్ధం చేసింది. ఫిబ్రవరి 25న సికింద్రాబాద్లోని రైల్ నిలయం ఆడిటోరియంలో SCR జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ యాప్ను ప్రారంభిస్తారు. భారతీయ రైల్వేలోనే ఈ వినూత్న ప్రాజెక్టును అమలు చేస్తున్న మొదటి డివిజన్గా హైదరాబాద్ డివిజన్ నిలవనుంది.
పార్శిల్ పికప్ (First Mile), రైలు రవాణా (Mid Mile), డెలివరీ (Last Mile) - ఈ మూడింటిని ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ కిందికి తీసుకువచ్చారు. దీనివల్ల పార్శిల్ రవాణా మరింత వేగంగా, పారదర్శకంగా మారుతుంది. వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలు, లాజిస్టిక్స్ భాగస్వాములు ఈ యాప్ ద్వారా సులభంగా తమ కన్సైన్మెంట్లను బుక్ చేసుకోవచ్చు. ట్రాక్ చేయవచ్చు. ఇదే వేదికపై దక్షిణ మధ్య రైల్వే, IIM బెంగళూరుతో ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోనుంది. రైల్వే నెట్వర్క్లో సరుకు రవాణాను మరింత మెరుగుపరచడంపై సమగ్ర మార్కెట్ అధ్యయనం కోసం ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది.