హైదరాబాద్: రాష్ట్రంలో పంటల సమగ్ర ప్రణాళికకు శాటిలైట్ మ్యాపింగ్ దిక్సూచిగా మారాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం వ్యవసాయశాఖ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతరిక్ష సాంకేతికత (Satellite Data) ఆధారంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం ప్రస్తుత కాలంలో అత్యవసరమని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగును మరింత లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ఈ మ్యాపింగ్ ప్రక్రియను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ప్రతి సీజన్లోనూ వర్షాభావ పరిస్థితులు, సాగులో ఉన్న వివిధ రకాల పంటలు, దిగుబడి అంచనాలు మరియు గిడ్డంగుల వసతులపై ముందే ఒక స్పష్టత లభిస్తుందని మంత్రి వివరించారు. ఈ విధానం వల్ల పంటల అంచనా, మార్కెటింగ్, సరఫరా వ్యవస్థ, పంట నష్టం గణన మరియు పంట బీమా వంటి అంశాలను సమన్వయం చేయడం సులభతరం అవుతుంది. తద్వారా రైతులకు సమయానుకూలంగా అవసరమైన సూచనలు చేయడంతో పాటు, విపత్తుల సమయంలో వేగంగా స్పందించడానికి వ్యవసాయశాఖకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయ రంగంలో జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతాయని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు.