వాహనదారులకు శుభవార్త.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై టోల్ ధరల తగ్గింపు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై ప్రయాణించే వాహనదారులకు ఊరట లభించింది.
By - అంజి |
వాహనదారులకు శుభవార్త.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై టోల్ ధరల తగ్గింపు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై ప్రయాణించే వాహనదారులకు ఊరట లభించింది. ఈ హైవేపై ఉన్న వివిధ టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సవరించిన ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1 (మంగళవారం అర్ధరాత్రి) నుండి అమలులోకి రానున్నాయి. ప్రధానంగా పంతంగి, కొర్లపహాడ్ మరియు చిల్లకల్లు టోల్ప్లాజాల వద్ద కొన్ని రకాల వాహనాలకు రూ. 5 నుండి రూ. 10 వరకు తగ్గింపు వర్తించనుంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ప్లాజా వద్ద 3 యాక్సిల్ కమర్షియల్ వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి రూ. 290 నుండి రూ. 285కి, అలాగే 24 గంటల్లో ఇరువైపులా ప్రయాణానికి రూ. 435 నుండి రూ. 430కి తగ్గించారు. అదేవిధంగా, కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద కూడా ఇదే రకమైన వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి రూ. 445 (గతంలో 450), రౌండ్ ట్రిప్కు రూ. 670 (గతంలో 675) గా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ పరిధిలోని చిల్లకల్లు టోల్ప్లాజా వద్ద సామాన్య వాహనదారులకు మరింత వెసులుబాటు కలిగింది. ఇక్కడ కారు, జీపు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి రూ. 105 నుండి రూ. 100కి ధర తగ్గింది. అలాగే 2 యాక్సిల్ వాహనాలకు రూ. 345, 3 యాక్సిల్ వాహనాలకు ఇరువైపుల ప్రయాణానికి రూ. 565 గా రుసుములను సవరించారు. పేర్కొన్న వాహన రకాలు మినహా మిగిలిన వాహనాల టోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.