Hyderabad: ర్యాపిడో సూపర్ ఆఫర్..ఆ రోజు ఫ్రీ రైడ్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి వచ్చేశాయి. ఇవాళ ఒక్కరోజుతో ప్రచారం ముగియనుంది. ఆ
By Srikanth Gundamalla Published on 28 Nov 2023 6:36 AM IST
Hyderabad: ర్యాపిడో సూపర్ ఆఫర్..ఆ రోజు ఫ్రీ రైడ్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి వచ్చేశాయి. ఇవాళ ఒక్కరోజుతో ప్రచారం ముగియనుంది. ఆ తర్వాత 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్ఉల చేస్తున్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా పలు రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు ఎన్నికల అధికారులు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాని రాజకీయ నేతలే కాదు.. సినీ, క్రీడా ప్రముఖులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు కూడా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
అయితే.. ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు కొందరికి వాహనాలు అవసరం ఉంటాయి. అందరి దగ్గర వాహనాలు ఉండకపోవచ్చు. పోలింగ్ శాతం మెరుగుపర్చేందుకు ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓటర్లందరికీ ఫ్రీ రైడ్ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం 2,600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు ర్యాపిడో సంస్థ వెల్లడించింది. ఈ సదుపాయం వృద్ధులతో పాటు సొంతవాహనాలు లేని మరికొందరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ర్యాపిడో బైక్ ట్యాక్సీని హైదరాబాద్లో వినియోగించే వారి సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఐటీ ఉద్యోగుల నుంచి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు.. కొత్తగా రూట్ తెలియని వారు బస్సు సదుపాయం లేని గల్లీల్లోకి కూడా ఈ ర్యాపిడో వచ్చేస్తుంది.
ఈ క్రమంలో పోలింగ్ రోజు ఫ్రీ రైడ్ ఆఫర్ గురించి మాట్లాడిన ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుండుపల్లి.. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తమ పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ర్యాపిడో సంస్థ పూర్తి ఉచితంగా రైడ్స్ కల్పిస్తోందని చెప్పారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అనుకునే ఓటర్లకు తమ వంతు సాయమని చెప్ఆపరు. ఈ ఫ్రీ రైడ్ ద్వారా ఓటింగ్ శాతం పెరిగితే చాలని అన్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రం వరకు చేర్చడం కోసం ఈ ఫ్రీ రైడ్ ఆఫర్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు పవన్ చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.