ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఎస్ఎల్బీసీ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తెలుసుకున్నారు. టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయ చర్యల గురించి రాహుల్ ఆరా తీశారు. ఘటనకు సంబంధించి వివరాలను దాదాపు 20 నిమిషాల పాటు రాహుల్కు సీఎం రేవంత్ వివరించారు. ఘటన జరిగిన వెంటనే మంత్రి ఉత్తమ్ ఘటనాస్థలికి వెళ్లారని రాహుల్కు రేవంత్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయని వివరించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎల్బీసీ ఘటనపై ప్రభుత్వ చర్యలను రాహుల్ అభినందించారు. చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాలని సూచించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో 24 మందితో కూడిన ఆర్మీ బృందం పాల్గొంది. సహాయ చర్యల్లో 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా బృందం, 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీమ్, 120 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలిన సంగతి తెలిసిందే.