గుడ్న్యూస్.. వారికి 100 రోజుల ఉపాధి పని
దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి హామీ కింద 100 రోజుల పని కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
By అంజి
గుడ్న్యూస్.. వారికి 100 రోజుల ఉపాధి పని
హైదరాబాద్: దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి హామీ కింద 100 రోజుల పని కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. నర్సరీలు, నీళ్లు పెట్టడం, వనసేవకులు ఇతర పనులు చేసే వెసులుబాటు కల్పించాలని సూచించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలకు అనుగుణంగా వీటిని అమలు చేయాలని సూచించింది. ట్రాన్స్జెండర్లకు ఒకే చోట పని కల్పించాలని ఆదేశించింది.
నీతి ఆయోగ్ ప్రకారం వెనుకబడిన జిల్లాలైన కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్లో రాష్ట్ర, జాతీయ సగటు కంటే ఎక్కువ పని దినాలు కల్పించాలని పేర్కొంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, మహబూబాబాద్ జిల్లా గంగారం, ములుగు జిల్లా కన్నాయిగూడెం, నారాయణపేట జిల్లా నర్వ, నిర్మల్ జిల్లా పెంబిలను ఆకాంక్షిత మండలాలుగా, భూపాలపల్లి జిల్లాలోని మల్హర్, నాగర్ కర్నూల్లోని పదర, ఆసిఫాబాద్లోని వాంకిడి, సిర్పూట్ టి, భద్రాద్రిలోని కర్కగూడెం, అన్నపురెడ్డిపల్లి, ఆలపల్లిలను సమూహ సౌకర్య మండలాలుగా గుర్తించింది.
వీటి పరిధిలో రాష్ట్రస్థాయి సగటు కంటే ఎక్కువ పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం సూచించింది. ఉత్తర్వుల ప్రకారం.. దివ్యాంగులు చేయడానికి వీలైన, అందుబాటులో ఉన్న పనులను మాత్రమే కేటాయించాలి. ట్రాన్స్జెండర్లకు ప్రతి గ్రామంలో పనులు కల్పించాలి. ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉంటే వారందరికీ ఒకేచోట పనులు కేటాయించాలి.