తెలంగాణ రాష్ట్రంలో ఎల్పిజి సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం (మార్చి 13, 2026) హైదరాబాద్లోని సెక్రటేరియట్లో గ్యాస్ సరఫరా, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు '99 రోజుల కార్యాచరణ ప్రణాళిక' పై ఆయన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహ వినియోగదారులకు, ఆసుపత్రులకు, ప్రభుత్వ హాస్టళ్లకు సరిపడా గ్యాస్ స్టాక్ అందుబాటులో ఉందని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో మొత్తం గ్యాస్ సరఫరాలో 86% గృహ అవసరాలకు, 14% వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను మంత్రి ఆదేశించారు. అక్రమ విక్రయాలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఉన్నా లేదా అక్రమంగా వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు తెలిసినా 1967 అనే టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణారావు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (HPCL, IOCL, BPCL) ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 1.29 కోట్ల గృహ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, డిమాండ్కు తగ్గట్టుగా తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 810 పంపిణీ కేంద్రాల ద్వారా సిలిండర్ల సరఫరా జరుగుతోందన్నారు