కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌కు గాయం అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  8 Dec 2023 5:11 AM GMT
mlc kavitha, tweet,  kcr, health condition,

కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌కు గాయం అయ్యింది. ఆయన గురువారం అర్ధరాత్రి తన ఫామ్‌హౌస్‌లో కాలు జారి కిందపడటంతో గాయం అయ్యింది. దాంతో.. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయన్ని సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్‌ను పరిశీలించిన వైద్యులు కేసీఆర్‌ తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దాంతో.. కేసీఆర్‌ను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ ఆరోగ్యం, చికిత్స గురించి ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఒక పోస్టు పెట్టారు.

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ప్రస్తుతం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఆయనకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని కవిత ఎక్స్ వేదికగా వెల్లడించారు. కేసీఆర్‌కు స్వల్ప గాయం అయ్యిందనీ.. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కేసీఆర్‌కు గాయం కావడం.. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నేతలు కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందనే దానిపై ఆస్పత్రి సిబ్బందితో పాటు.. కేసీఆర్‌ కుటుంబ సభ్యులను ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్‌ వేదికగా కేసీఆర్ ఆరోగ్యం గురించి వెల్లడించారు.

Next Story