ఈడీ నోటీసు కాదు.. మోదీ నోటీసు : ఎమ్మెల్సీ క‌విత రియాక్ష‌న్‌

తనకు మోడీ నోటీసు వచ్చిందని ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు.

By Medi Samrat  Published on  14 Sep 2023 12:06 PM GMT
ఈడీ నోటీసు కాదు.. మోదీ నోటీసు : ఎమ్మెల్సీ క‌విత రియాక్ష‌న్‌

ఈడీ నోటీసుల‌పై ఎమ్మెల్సీ క‌విత స్పందించారు. గురువారం ఆమె నిజామాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తనకు మోడీ నోటీసు వచ్చిందని సెటైర్ వేశారు. రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని అమె అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ లీగ‌ల్‌ విభాగానికి ఇచ్చామని.. వారు ఎలా చెబితే అలా ముందుకెళ్తామని తెలిపారు. ఈ వ్యవహారంపై పెద్దగా ఆలోచించవద్దని.. గత ఏడాది కాలంగా టీవీ సీరియల్ లాగా సాగదీస్తున్నారని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. మళ్లీ ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని సెటైర్ సంధించారు.

2జీ కేసు కూడా ఇంత కాలం సాగలేదని.. కేవలం రాజకీయ దురుద్ధేశాలతోనే ఈడీ నోటీసులు పంపించిందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నా.. ఇదే తీరుతో వ్యవహరించడం బీజేపీ విధానమని విమర్శించారు.

సీఎం కేసీఆర్‌ కి వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భయపడుతున్నాయని అన్నారు. తెలంగాణలో మరో సారి కేసీఆర్‌ సీఎం కాబోతున్నారని తెలిపారు. దేశ ప్రజలు కూడా కేసీఆర్‌ పట్ల సానుకూలంగా ఉన్నారని .. దీంతో రకరకాల ఆరోపణలు రావ‌డం స‌హ‌జ‌మ‌ని.. తాము ఏ పార్టీకీ బీ టీమ్ కాదని స్ప‌ష్టం చేశారు.

Next Story