చాలా రోజులకు రాత్రి కంటినిండా నిద్రపోయా: కేటీఆర్

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక కౌంటింగ్‌ జరగాల్సి ఉంది.

By Srikanth Gundamalla  Published on  1 Dec 2023 8:35 AM GMT
minister ktr, tweet, exit polls, telangana,

 చాలా రోజులకు రాత్రి కంటినిండా నిద్రపోయా: కేటీఆర్ 

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక కౌంటింగ్‌ జరగాల్సి ఉంది. డిసెంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ నేపథ్యంలో వెలువడుతున్న ఎగ్జిట్‌ పోల్స్‌ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కొన్నేమో కాంగ్రెస్‌కు అధికారం పక్కా అంటుంటే.. ఇంకొన్ని కేసీఆర్‌ సర్కార్‌ మరోసారి రావడం ఖాయమంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికారం ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు విజయం తమదే అని ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్‌ నాయకులు దీమాగా ఉన్నారు.

తాజాగా మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా స్పందించారు. చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని చెప్పుకొచ్చారు. ఈమేరకు ట్వీట్‌ చేసిన ఆయన ఎగ్జిట్‌పోల్స్‌ గురించి కూడా రాసుకొచ్చారు. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయనీ.. అసలైన ఫలితాలు తమకు శుభవార్త చెబుతాయని దీమా వ్యక్తం చేశారు. ఇక అంతకుముందు గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత కేటీఆర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విసం తెలిసిందే. 88 సీట్లు వస్తాయని భావించామని.. కానీ వేర్వేరు కారణాల వల్ల 70కి పూఐగా స్తానాల్లో బీఆర్ఎస్‌ గెలవబోతుందని చెప్పారు.

మరోవైపు కౌంటింగ్‌ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అటువైపుగా ఎవరూ తిరగకుండా చూసుకుంటున్నారు. 144 సెక్షన్‌ అమల్లో ఉందని వెల్లడించారు పోలీసులు. గుంపులు గుంపులుగా స్ట్రాంగ్‌రూముల వద్ద తిరిగే చర్యలు తప్పవని చెబుతున్నారు. ఎన్నిల కౌంటింగ్‌ కోసం రాజకీయ నేతలు, అభ్యర్తులతో పాటు యావత్‌ రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story