నాంపల్లి అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

నాంపల్లి అగ్నిప్రమాద స్థలిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి పరిశీలించారు.

By Srikanth Gundamalla  Published on  13 Nov 2023 8:45 AM GMT
minister ktr, nampally, fire accident, ex gratia,

నాంపల్లి అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా 

హైదరాబాద్‌ నాంపల్లిలోని బజార్ ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలతో పాటు ఒక చిన్నారి కూడా ఉంది. అయితే.. మరికొందరికి తీవ్ర గాయాలు కాగా.. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు అధికారులు. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి పరిశీలించారు.

అగ్నిప్రమాదం గురించి మంత్రి కేటీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు కేటీఆర్‌కు వివరించారు. మంత్రి తలసానితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రమాద వార్త ఎంతో షాక్‌కు గురిచేసిందని చెప్పారు. రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో కెమికల్ డబ్బాలను నిల్వ చేయడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువ అయ్యిందని అధికారులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు. బిల్డింగ్ యజమాని రమేశ్ జైస్వాల్‌కు సిటీలో కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని.. అక్కడ తయారైన కెమికల్స్‌ను బిల్డింగ్‌లోని ఫస్ట్‌ ఫ్లోర్‌లో నిల్వ చేస్తున్నాడని అధికారులు చెప్పారు. దాంతో.. రెండు, మూడో అంతస్తులో ఉన్నవారు మంటల్లో చిక్కుకున్నారని వెల్లడించారు. ఒకే కుటుంబంలోని తొమ్మిది మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. కాగా... ప్రస్తుతం బిల్డింగ్ యజమాని రమేశ్ జైస్వాల్ పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

మంత్రి కేటీఆర్ మరాట్లాడుతూ.. తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల నష్టపరిహారం ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు కేటీఆర్. అదే విధంగా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేలా చూస్తామన్నారు. ప్రమాద సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ వివరించారు. రెసిడెన్షియల్ ఏరియాలో రసాయనాలను నిల్వ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపై లోతుగా విచారణ జరిపిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Next Story