హైదరాబాద్: లష్కర్ బోనాల జాత అంగరంగ వైభవంగా సాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. 'రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. ముందే హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండండి' అని హెచ్చరించారు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిసేలా, పంటలు సమృద్ధిగా పండేలా చూస్తానన్నారు. తనకు సక్రమంగా పూజలు జరిపించాలని కోరారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు.
''బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారని, కానీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాని చెప్పారు. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారని, తాను అడ్డురానన్నారు. బోనాల జాతరకు సంతోషంగా సాకలు పోసి బాగా చేశారని, అయితే ప్రతీసారి చేసినట్టే ఈ సారి కూడా పొరపాటు చేశారని చెప్పారు. ప్రతి సంవత్సరం చెబుతున్నా.. నా బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను. నా పూజలు అన్ని సక్రమంగా జరిపించాలి. వేల రాసులు నేను రప్పించుకుంటున్న. నాకు రక్తం బలి ఇవ్వడం లేదు. మీరు మాత్రం ఆరగిస్తారు. నాకు మాత్రం ఇవ్వడం లేదు.. నాకు సరిగ్గా పూజలు చెయ్యకపోతే రక్తం కక్కుకొని చస్తారు'' అని హెచ్చరించారు.