BREAKING: గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం
జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఇంటిక్యాలపాడు సమీపంలో...
By - అంజి |
BREAKING: గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం
జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఇంటిక్యాలపాడు సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి పక్కకు పడిపోవడంతో పెను శబ్దం వచ్చింది. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.
బస్సు బోల్తా పడిన వేగానికి పలువురు ప్రయాణికుల కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొందరికి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తెల్లవారుజామున చీకటిగా ఉన్న సమయంలో జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్లలో తరలించారు.
గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి (GGH) తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి అత్యవసర విభాగంలో చికిత్స అందుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం లేదా అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, సాంకేతిక లోపం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.