100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న చెట్లను కొట్టేయకుండా తరలించారు

100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న చెట్లను కొట్టేయకుండా తరలించారు.. మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం 100 ఏళ్లు పైబడిన నాలుగు చెట్లను ఒక చోటు నుండి మరో చోటుకు మార్చే కార్యక్రమాన్ని చేపట్టింది. పట్టణంలో ప్రస్తుతం ఉన్న రోడ్లు, భవనాల అతిథి గృహంలో జిల్లా యంత్రాంగం కూరగాయల మార్కెట్‌ను నిర్మిస్తోంది.

By Medi Samrat  Published on  17 April 2022 8:37 AM GMT
100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న చెట్లను కొట్టేయకుండా తరలించారు

మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం 100 ఏళ్లు పైబడిన నాలుగు చెట్లను ఒక చోటు నుండి మరో చోటుకు మార్చే కార్యక్రమాన్ని చేపట్టింది. పట్టణంలో ప్రస్తుతం ఉన్న రోడ్లు, భవనాల అతిథి గృహంలో జిల్లా యంత్రాంగం కూరగాయల మార్కెట్‌ను నిర్మిస్తోంది. అయితే, ఆ ప్రాంగణంలో 100 ఏళ్లకు పైబడిన నాలుగు చెట్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హరితహారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో, జిల్లా యంత్రాంగం గ్రీన్ ఇండియా ఛాలెంజ్, ఇతర సంస్థలతో కలిసి నాలుగు పాత చెట్లను పట్టణ అంచులలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్కుకు తరలించింది.

టూరిజం మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం 'ట్రాన్స్‌లోకేషన్' పద్దతిని స్వయంగా పర్యవేక్షించారు. చెట్లను తరలించడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్ రావు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వాటా ఫౌండేషన్, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయ భాస్కర్, ఇతర ఇంజినీరింగ్ సిబ్బంది కృషిని మంత్రి అభినందించారు. చెట్లను తరలించడంలో జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి నగరవాసుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు & రాజ్యసభ ఎంపీ జె సంతోష్ కుమార్ ట్రాన్స్‌లోకేషన్‌ను సాధ్యం చేయడం కోసం చేసిన కృషిని వారు అభినందించారు. ఎలాంటి నష్టం జరగకుండా చెట్లను మార్చామని, తాము చేసిన పని విజయవంతమైందని అధికారులు తెలిపారు.

Next Story