మందుబాబులకు షాక్.. తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు!
తెలంగాణలోని మద్యం ప్రియులకు త్వరలో చేదువార్త అందే ఛాన్స్ ఉంది. వచ్చే నెల (మే) నుంచి రాష్ట్రంలో మద్యం, బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని...
By - అంజి |
మందుబాబులకు షాక్.. తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు!
తెలంగాణలోని మద్యం ప్రియులకు త్వరలో చేదువార్త అందే ఛాన్స్ ఉంది. వచ్చే నెల (మే) నుంచి రాష్ట్రంలో మద్యం, బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు, ముడిసరుకుల ధరల పెరుగుదల వంటి కారణాలతో ఈ భారం సామాన్యుడిపై పడనుంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా సహజ వాయువు (Natural Gas) సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీనివల్ల గాజు సీసాల తయారీ ఖర్చు భారీగా పెరిగింది.
దేశంలో గాజు సీసాల ఉత్పత్తి 40 శాతం పడిపోగా, ఖాళీ సీసాల ధరలు 20 శాతం పెరిగాయి. పెరిగిన తయారీ ఖర్చులను భరించలేమని, మద్యం ధరలను 12-15 శాతం పెంచాలని తయారీదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వేసవి కావడంతో బీర్లకు డిమాండ్ 30 శాతం పెరిగింది. అయితే సీసాల కొరత, అల్యూమినియం క్యాన్ల ధరలు పెరగడం వల్ల సరఫరా 20 శాతం తగ్గింది. ఫలితంగా ఇప్పటికే కొన్ని చోట్ల కొరత మొదలైంది. మద్యం తయారీదారుల విన్నపాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీని నియమించింది.
ఈ కమిటీ బాటిల్ పరిమాణం, బ్రాండ్ల వారీగా రేట్లు, పన్నుల విశ్లేషణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా మే నెలలో ప్రభుత్వం కొత్త ధరలను ఖరారు చేసే అవకాశం ఉంది. ధరల పెంపు ఆలస్యమైతే లేదా సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందని ఎక్సైజ్ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం పరోక్షంగా రాష్ట్రంలోని మద్యం వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టబోతోంది.