హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటన జరిగి 200 రోజులు దాటినా స్పందించడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. 200 రోజులు దాటినా, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆరు మృతదేహాలను ఇప్పటికీ వెలికితీయ లేదన్నారు. అటు బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా అందించలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎస్ఎల్బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదని ప్రశ్నించారు.
బీజేపీ బడే భాయ్ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ చోటే భాయ్ని ఎప్పుడూ కాపాడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున, ఆ ఆరు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆ ఆరుగురి ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలబడతామని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దానితో పాటు ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు తాము సమాధానాలు రాబడతామని కేటీఆర్ అన్నారు.