గజ్వేల్‌లో సీక్రెట్ ఎయిర్ బేస్ ఉండొచ్చు?.. కేసీఆర్‌ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై కొండా కౌంటర్‌

Konda vishweshwar reddy counters cm kcr cloud bursting comments. గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్టింగ్ జరిగిందని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి.

By అంజి  Published on  18 July 2022 11:00 AM GMT
గజ్వేల్‌లో సీక్రెట్ ఎయిర్ బేస్ ఉండొచ్చు?.. కేసీఆర్‌ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై కొండా కౌంటర్‌

గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్టింగ్ జరిగిందని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలను అర్థం పర్థం లేనివిగా కొందరు నేతలు కొట్టిపారేస్తున్నారు. మరికొందరు నేతలు సెటైరికల్‌గా స్పందిస్తున్నారు తాజాగా ఒకప్పటి టీఆర్ఎస్ మాజీ ఎంపీ, తర్వాత కాంగ్రెస్ నేత, ఇటీవల బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేసీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. క్లౌడ్ బరస్టింగ్ కు సంబంధించి కేసీఆర్ ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. ఒకవేళ వర్షం 100 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువగా పడితే క్లౌడ్ బరస్టు జరిగిందని అనుమానించాలని చెప్పారు.

వరదలకు కారణం విదేశాల కుట్రని కేసీఆర్ అన్నారని, మరీ అసలు క్లౌడ్ బరస్ట్ చేసింది పాకిస్తానా? లేక చైనానా? చెప్పాలని ఎద్దేవా విశ్వేశ్వర్‌ రెడ్డి చేశారు. రాకెట్లు లేదా విమానంతో క్లౌడ్ బరస్ట్ చేయాలంటే వాళ్ళకి భారత్‌ ఒక సీక్రెట్ ఏయిర్‌ బేస్ కచ్చితంగా ఉండాలని వివరించారు. బహుశా ఆ ఎయిర్ బేస్ కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే ఉండి ఉంటుందని ఎద్దేవా చేశారు.

గోదావరి వరదలకు కారణం కుట్ర: కేసీఆర్

గోదావరి వరదలకు కారణం కుట్ర జరిగి ఉండవచ్చని సీఎం కేసీఆర్ జూలై 17న భద్రాచలం పర్యటన సందర్భంగా అనుమానం వ్యక్తం చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే విధానంతో ఇతర దేశాల వాళ్లు మన దేశంలో అక్కడక్కడ ఈ పని చేసి ఉంటారని ఆరోపించారు. కావాలనే ఈ పని చేసి ఉన్నారని, గతంలో కశ్మీర్‌లో లద్దాఖ్, లేహ్‌లో చేశారని, తర్వాత ఉత్తరాఖండ్‌లోనూ క్లౌడ్ బరస్ట్ చేశారని గుర్తు చేశారు. ఈ మధ్య గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోనూ క్లౌడ్ బరస్ట్ చేశారని తమకు సమాచారం వచ్చిందని కేసీఆర్ అన్నారు.

Next Story