పవన్‌ గురించి కిషన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యల ప్రచారంపై క్లారిటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి జనసేన కూడా పోటీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  11 Dec 2023 5:39 AM GMT
kishan reddy, clarity, janasena,

పవన్‌ గురించి కిషన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యల ప్రచారంపై క్లారిటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి జనసేన కూడా పోటీ చేసింది. బీజేపీతో పొత్తుపెట్టుకున్న ఆ పార్టీ 8 స్థానాల్లో పోటీకి దిగింది. జనసేన అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా జోరుగా ప్రచారం చేశారు. అయితే.. ఈ ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే మెరుగైన స్థానాలను గెలుచుకుంది. ఓటింగ్‌ శాతాన్ని కూడా పెంచుకుంది. కానీ.. తొలిసారి పోటీలో జనసేనను మాత్రం తెలంగాణ ప్రజలు ఆదరించలేదు. పోటీ చేసిన స్థానాల్లో కనీసం డిపాజిట్లు కాపాడుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరిగింది. పవన్‌ కళ్యాణ్‌ గురించి అనుచిత వ్యాఖ్యలు కిషన్‌రెడ్డి చేశారంటూ వార్తలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యల ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.

ఈ మేరకు కిషన్‌రెడ్డి ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా స్పందించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం ఒక్కరిద్దరు తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. ఇరు పార్టీలు సమగ్రంగా చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు. అంతేకాదు.. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్యపక్షంగా జనసేన ఉంది కాబట్టే తెలంగాణలో ఇరు పార్టీలు కలిసి బరిలోకి దిగాయని కిషన్‌రెడ్డి అన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని కోరారు. అలాగే ఈ ప్రచారం చేసినవారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.

బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఇరు పార్టీల నేతలు భావించారు. కానీ.. అలా జరగలేదు. జనసేనకు డిపాజిట్లు దక్కలేదు. బీజేపీ కూడా 8 స్థానాల్లో గెలిచింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఎక్కవ స్థానాలే గెలిచినా.. ఆ పార్టీ నేతలు మాత్రం పొత్తు ద్వారా మరొకొన్ని స్థానాల్లో కూడా విజయం సాధిస్తామని భావించారు. ఈ క్రమంలోనే జనసేనతో పొత్తు వల్లే బీజేపీకి పరాభవం ఎదురైందని కిషన్‌రెడ్డి అన్నట్లు కొందరు సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. చివరికి కిషన్‌రెడ్డి వరకు ఈ వార్తలు చేరడంతో ఆయన స్పందించారు. ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. ఆ పార్టీతో సంబంధాలు బాగున్నాయంటూ కిషన్‌రెడ్డి వెల్లడించారు.


Next Story