కామారెడ్డి జిల్లాలో విషాదం, పాము కాటుతో తండ్రీకొడుకు మృతి

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  22 July 2023 6:29 AM GMT
Kamareddy, Snake Bite, Father Son, Died,

కామారెడ్డి జిల్లాలో విషాదం, పాము కాటుతో తండ్రీకొడుకు మృతి

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాము కాటుకు గురై తండ్రితో పాటు 11 ఏళ్ల కొడుకు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శేర్‌శంకర్‌ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మూడుమామిళ్లలో జరిగింది ఈ ఘటన. రాత్రి ఇంట్లో పడుకున్న సమయంలో పాము దూరింది. పడుకున్న చోటుకి వచ్చి కొడుకుని కాటు వేసింది. పాము కాటుతో బాబు గట్టిగా అరిచాడు. దాంతో తండరి రవి (36) వెంటనే మేల్కొన్నాడు. ఏమైందని అడగ్గా బాబు పాము కుట్టిన చోటుని చూపించాడు. ఇంట్లో లైట్‌ ఆన్‌ చేయగా పాము బయటకు వెళ్లడాన్ని గమనించారు. వెంటనే పాముని చంపేందుకు రవి వెంటపడ్డాడు. కర్ర తీసుకుని పాముని కొట్టి చంపేప్రయత్నం చేశాడు. పాము బుసలు కొడుతూ రవిని కూడా కాటు వేసింది.

అయితే.. ఇది గమనించిన స్థానికులు ఇద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందారు. అయితే.. అంతకుముందు ఇంటి వద్దే తండ్రి కొడుకు ఏదో పసరు తీసుకున్నారని.. ఏం కాదు అంటూ ఇంటి వద్దే ఉన్నారని చెప్పారు. తర్వాత ఇద్దరి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కానీ.. అప్పటికే బాడీ మొత్తం విషం వ్యాపించిందని.. చికిత్స పొందుతూ మృతిచెందరాని చెబుతున్నారు. తండ్రీ కొడుకులు మృతిచెందడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story