విషాదం.. భూమిని కోల్పోతున్నాననే బాధతో.. రైతు ఆత్మహత్య
Kamareddy Farmer ends life over losing land for industrial zone. ఇండస్ట్రియల్ జోన్ కోసం తన భూమిని కోల్పోతున్నారనే ఆందోళనతో.. తెలంగాణలోని కామారెడ్డి
By అంజి Published on 4 Jan 2023 6:43 PM IST
ఇండస్ట్రియల్ జోన్ కోసం తన భూమిని కోల్పోతున్నారనే ఆందోళనతో.. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇండస్ట్రియల్ జోన్ కోసం రూపొందించిన ప్రణాళికను ఉపసంహరించుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తూ రైతులు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి అడ్లూరు యల్లారెడ్డిలోని తన ఇంట్లో పి.రాములు (36) అనే రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మున్సిపల్ మాస్టర్ప్లాన్లో ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ జోన్కు తన రెండెకరాల భూమి పోతుందని ఆందోళన చెందుతున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
అడ్లూరు ఎల్లారెడ్డి, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు బుధవారం కామారెడ్డికి చేరుకుని నిరసన తెలిపారు. ఇండస్ట్రియల్ జోన్ కోసం భూములు సేకరించే ఆలోచనను అధికారులు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళలు సహా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆందోళనకారులు మున్సిపల్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు గేట్లకు తాళాలు వేశారు. బాధితుడి మృతదేహాన్ని తమకు అప్పగించాలని రైతులు పోలీసులను కోరారు.
బస్టాండ్లో ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు వేదికను మార్చేందుకు హామీ ఇచ్చారని, మృతదేహాన్ని అప్పగిస్తామని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు. ఆందోళనకారులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నా పోలీసులు మృతదేహాన్ని అప్పగించలేదు. సదాశివనగర్ మండలంలోని కొన్ని గ్రామాల రైతులు సాగు భూములు కోల్పోయి జీవనాధారం కోల్పోవాల్సి వస్తుందని, మాస్టర్ప్లాన్కు ముందుకు వెళ్లవద్దని అధికారులను కోరుతున్నారు. పారిశ్రామిక జోన్ కోసం 1200 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.