తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 'రైతుబంధు' పాలన పోయి, 'రాబందుల' పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ (బి) గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి ఆత్మహత్యపై ఆయన స్పందిస్తూ, ఇది ముమ్మాటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన 'హత్యే'నని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న గోసను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.
గత నవంబర్ 18న తాను స్వయంగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్కు వెళ్లినప్పుడు గణపతి పడుతున్న కష్టాలను చూశానని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లోనే తన సోయాబీన్ పంటను ప్రభుత్వం కొనడం లేదని, నాలుగు రోజులుగా యార్డులోనే పడిగాపులు కాస్తున్నానని గణపతి కన్నీళ్ల పర్యంతం అయ్యాడని తెలిపారు. "పంట కొనకుండా ప్రభుత్వం ఇలాగే వేధిస్తే నాకు మరణమే శరణ్యం" అని ఆ రోజే ఆ రైతు రోదించాడని, ఆ ఆవేదన ఈ రోజు నిజమైందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రుణమాఫీ కాకపోవడం, రైతు భరోసా నిధులు అందకపోవడంతో అప్పుల బాధ పెరిగిపోయి గణపతి ప్రాణాలు తీసుకున్నాడని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ మొండివైఖరి వల్లే రైతన్నలు ఆత్మహత్యల బాట పడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులను ఆదుకోవడంలో విఫలమైన ఈ ప్రభుత్వం వెంటనే రైతు సంక్షేమంపై దృష్టి సారించాలని, చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.