ఐటీ దాడులు.. మల్లా రెడ్డి గ్రూప్ రిటర్న్స్‌లో తేడాలు.. రూ.4 కోట్ల నగదు స్వాధీనం

IT raids.. Discrepancies in Malla Reddy Group's returns.. Rs 4 Cr cash recovered. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ కార్మిక శాఖ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Nov 2022 7:56 AM GMT
ఐటీ దాడులు.. మల్లా రెడ్డి గ్రూప్ రిటర్న్స్‌లో తేడాలు.. రూ.4 కోట్ల నగదు స్వాధీనం

హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ కార్మిక శాఖ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన పలు ప్రాంతాల్లో రెండో రోజు కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. మల్లా రెడ్డి గ్రూప్ దాఖలు చేసిన పన్ను రిటర్నులలో, ముఖ్యంగా ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల రిటర్న్స్‌లలో తేడాలు ఉన్నట్లు విచారణలో తేలింది. మల్లారెడ్డి బంధువు అశోక్‌రెడ్డి వద్ద నుంచి, మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడి ఇంటి నుంచి 4 కోట్ల రూపాయల నగదును కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బోయిన్‌పల్లిలోని మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు ముగించారు. అయితే ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు సంబంధించి పన్ను ఎగవేతకు సంబంధించి ఈ దాడులు జరిగాయి.

మంగళవారం ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన సోదాలు.. బోయిన్‌పల్లిలోని ఆయన నివాసం, కొంపల్లిలోని పామ్ మెడోస్ కమ్యూనిటీ సహా పలు ప్రాంతాల్లో జరిగాయి. పన్ను ఎగవేత నిరోధక విభాగానికి చెందిన దాదాపు 50 మంది అధికారులు మంత్రి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. గతంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీ చేసి కాంగ్రెస్‌ తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ రేవంత్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. మల్లా రెడ్డి.. మల్లా రెడ్డి గ్రూపు కళాశాలల చైర్మన్, కార్మిక శాఖ మంత్రి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి శాసనసభ్యుడు.

మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది 2012-2013 సంవత్సరంలో ప్రారంభించబడిన ఒక ప్రైవేట్ వైద్య కళాశాల. ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్, హైదరాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెడికల్ సీట్లను అధిక ధరకు అమ్ముతున్నారనే ఆరోపణలపై గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి.

టీఆర్ఎస్ మంత్రులు, నేతలపై ఈడీ, ఐటీ, సీబీఐ ఎలా దృష్టి సారిస్తున్నాయంటే..

గత ఏడాది కాలంలో టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు, కేసులు పెరిగాయి. మల్లారెడ్డితో పాటు మరో ముగ్గురు సీనియర్ టీఆర్‌ఎస్ నేతలు ఎన్‌ఫోర్స్‌మెంట్ రాడార్‌లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం టీఆర్‌ఎస్‌ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు సంబంధించిన గ్రానైట్‌ కంపెనీలపై దాడులు జరిగాయి. హైదరాబాద్, కరీంనగర్‌లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది.

గ్రానైట్ కంపెనీలకు బినామీ ఖాతాలు ఉన్నట్లు విచారణలో తేలింది. పనామా లీక్స్‌లో పేరున్న చైనా సంస్థతో ఉన్న సంబంధాలను కూడా బయటపెట్టింది. దాదాపు ఐదు కంపెనీలు ఫెమా కింద బుక్ అయ్యాయి.

2022 అక్టోబర్‌లో.. రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్, మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌పై కొనసాగుతున్న మనీలాండరింగ్ కేసులో పీఎంఎల్‌ చట్టం 2022 నిబంధనల ప్రకారం దాని డైరెక్టర్, ప్రమోటర్లు అయిన టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, అతని కుటుంబ సభ్యులకు చెందిన రూ. 80.65 కోట్ల విలువైన 28 స్థిరాస్తులు, ఇతర ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా అటాచ్ చేసింది.

నామా నాగేశ్వర్ రావు మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ప్రమోటర్, డైరెక్టర్, కంపెనీ డిఫాల్ట్ చేసిన బ్యాంక్ రుణానికి వ్యక్తిగత హామీదారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల రిజిస్టర్డ్ కార్యాలయం, నివాస ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. మొత్తంగా రాంచీ ఎక్స్‌ప్రెస్‌వేస్ లిమిటెడ్ పొందిన బ్యాంకు రుణం నుండి రూ. 361.29 కోట్ల ప్రత్యక్ష మళ్లింపును ఈడీ కనుగొంది.

నవంబర్ 21న.. కొనసాగుతున్న క్యాసినో కేసుకు సంబంధించి టిఆర్‌ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగత సహాయకుడిని ఇడి అధికారులు ప్రశ్నించారు. ముఖ్యంగా నేపాల్‌లో జూదం కోసం వెచ్చించిన డబ్బుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. చికోటి ప్రవీణ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడీ హరీశ్‌ను విచారించింది.

Next Story