తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి మరియు ధనిక అనే తేడా లేకుండా దాదాపు 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఏదైనా కారణం చేత కుటుంబ యజమాని లేదా సభ్యుడు మరణిస్తే, ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రాథమికంగా రూ. 4,000 కోట్లు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన 2026 జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
సాధారణంగా ప్రభుత్వ బీమా పథకాలు కేవలం బియ్యం కార్డు ఉన్నవారికే వర్తిస్తాయి. కానీ, ఈ పథకాన్ని కుల, మత, వర్గ విభేదాలు లేకుండా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆకస్మిక మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా ఈ రూ. 5 లక్షల నగదు అండగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ బీమాకు సంబంధించి లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని, పూర్తి ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సమాచారం. ఈ పథకానికి సంబంధించి అర్హత ప్రమాణాలు, నమోదు ప్రక్రియ, క్లెయిమ్ చేసుకునే విధానంపై పూర్తి స్థాయి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది.