తెలంగాణలోని 19 జిల్లాల్లో ఆదివారం (మార్చి 29, 2026) ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఐఎమ్డి తాజా బులెటిన్ ప్రకారం.. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఈదురు గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది.
హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రాబోయే 24 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 38°C - కనిష్ట ఉష్ణోగ్రత 25°C గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.