Hyderabad: అర్ధరాత్రి రోడ్డెక్కిన నిరుద్యోగులు.. ఉదయం 3 గంటలకు నిరసనలు
శనివారం నిరుద్యోగులు అర్ధరాత్రి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
By Srikanth Gundamalla Published on 14 July 2024 9:00 AM IST
Hyderabad: అర్ధరాత్రి రోడ్డెక్కిన నిరుద్యోగులు..ఉదయం 3 గంటలకు నిరసనలు
గ్రూప్-2 పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. శనివారం నిరుద్యోగులు అర్ధరాత్రి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల పెంపుతో పాటు డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని అశోక్ నగర్ చౌరస్తాలో వేల మంది నిరుద్యోగులు మెరుపు ధర్నా చేశారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. చౌరస్తాలోని రోడ్డుపైనే కూర్చొని ధర్నా చేశారు. రాత్రి 9 గంటలకు మొదలైన నిరసన కార్యక్రమం తెల్లవారుజాము 3 రాస్తా రోకో చేపట్టారు. నిరుద్యోగుల ఆందోళనల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మూడు గంటల పాటు నిరుద్యోగులు నిరసనలు చేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మరోవైపు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్సుఖ్నగర్లో భారీ ర్యాలీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంకటాద్రి థియేటర్ నుంచి మెట్రో స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. రాజీవ్చౌక్ వద్ద ధర్నా చేశారు. తాము న్యాయమైన డిమాండ్లతోనే ధర్నాలు చేస్తున్నామని చెప్పారు. దీన్ని కూడా రాజకీయం చేయడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలతో దిల్సుఖ్నగర్తో పాటు ఎల్బీనగర్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.
ఇక అశోక్నగర్ వద్ద ఆందోళనల్లో భాగంగా ఓ యువతి నిద్రమాత్రలు మింగిందని తెలసింది. ఆమెను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ మండిపడ్డారు. ట్రాఫిక్ భారీగా జామ్ అవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. అశోక్నగర్, దిల్సుఖ్నగర్తో పాటు ఓయూలో కూడా నిరుద్యోగులు ఆందోళనలు చేశారు. అశోక్నగర్లో అదనపు సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. నిరుద్యోగులను బలవంతంగా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.