ధర్నాచౌక్‌లో ఆందోళనలకు అనుమతి ఉంది: హైదరాబాద్ సీపీ

ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ధర్నాలు చేసుకునే హక్కు ఉందని అన్నారు హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి.

By Srikanth Gundamalla  Published on  15 Dec 2023 4:00 PM GMT
hyderabad, police commissioner,  dharna chowk,

ధర్నాచౌక్‌లో ఆందోళనలకు అనుమతి ఉంది: హైదరాబాద్ సీపీ

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ధర్నాచౌక్‌ను యథావిధిగా కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాలు చేసేందుకు అనుమతి ఉంటుందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ధర్నాలు చేసుకునే హక్కు ఉందని అన్నారు హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి. ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాలకు అనుమతి ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంటుందని అన్నారు. అయితే.. ధర్నాచౌక్‌ వద్ద శాంతియుతంగా ఎవరైనా సరే ధర్నాలు చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. ధర్నాలు చేసే వారి సమస్యలను తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్. ధర్నాచౌక్‌ అంశంపై ఇప్పటికే పలు పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ధర్నాచౌక్‌ను పరిశీలించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే.. ధర్నాలు చేస్తున్న సమయంలో రోడ్లను మూసివేసి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే మాత్రం ఊరుకోమని సీపీ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ధర్నాలు నిర్వహించుకోవచ్చని సూచించారు. కాగా.. గత రెండ్రోజులుగా ట్రాఫిక్‌ వ్యవహారంపై చర్చ జరిగిందని.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ట్రాఫిక్‌ కొద్దిగా ఎక్కువగానే ఉంటుందని అన్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ఎప్పుడూ రోడ్లపైనే ఉంటున్నారని చెప్పారు. అలాగే ప్రజావాణి కోసం ఫిర్యాదుదారుల కోసం సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు సీపీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

Next Story