కేఏ పాల్ భద్రతపై.. డీజీపీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

Highcourt asks state DGP to examine & take decision on KA Paul security. హైదరాబాద్: కేఏ పాల్‌కు ఉన్న ముప్పును అంచనా వేసి, 30 రోజుల్లోగా ఆయన వ్యక్తిగత

By అంజి  Published on  9 Feb 2023 3:30 PM GMT
కేఏ పాల్ భద్రతపై.. డీజీపీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్: కేఏ పాల్‌కు ఉన్న ముప్పును అంచనా వేసి, 30 రోజుల్లోగా ఆయన వ్యక్తిగత భద్రతను పునరుద్ధరించడంపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం ఆదేశించింది. తన వ్యక్తిగత పోలీసు భద్రతను పునరుద్ధరించేలా డీజీపీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేఏ పాల్ రాసిన లేఖ ఆధారంగా ధర్మాసనం సుమోటోగా పిల్‌ను స్వీకరించింది. కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ నాయకుడు, ప్రముఖ సువార్తికుడు.

పోలీసులు తనను వేధిస్తున్నారని, ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటున్నారని పిటిషన్‌లో పాల్‌ పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ కొత్త సచివాలయం, గన్‌పార్క్‌కు వెళ్లిన పాల్‌ను అడ్డుకున్నారు. పిటిషన్‌ను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం 30 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టులో వాదనల సందర్భంగా నూతన సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై పాల్‌ ప్రస్తావన తెచ్చారు. అందుకు డీజీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇటీవల కొత్త సచివాలయ భవనంలో అగ్నిప్రమాదం జరిగిందని కేఏ పాల్‌ కోర్టుకు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని మీడియా విభిన్నంగా నివేదించగా, కొందరు గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయని, మరికొందరు మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 5వ అంతస్తు, 6వ అంతస్తు అని చెప్పారు. ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. అగ్నిప్రమాదం జరిగి వారం రోజులు గడిచినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదన్నారు. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారో తమకు తెలియదని పాల్‌ అన్నారు. సీఎం పాత సచివాలయ భవనాన్ని రూ.500 కోట్లు వృధా చేసి కూల్చివేశారని పాల్ అన్నారు. "వాస్తు" పేరుతో కొత్త భవన నిర్మాణానికి రూ.600 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

సచివాలయం అగ్నిప్రమాదంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన వాదించారు. పాల్ చేసిన అసంబద్ధమైన సమర్పణలపై అగ్నిమాపక భద్రత, జైళ్ల శాఖ జిపి సామల రవీందర్ మరియు హోమ్ జిపి రూపేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన అంశంలోకి ప్రవేశించడానికి ఇష్టపడటం లేదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కేఏ పాల్‌కు బెదిరింపుపై 30 రోజుల్లోగా పరిశీలించి భద్రతపై నిర్ణయం తీసుకోవాలని డీజీపీని సీజే బెంచ్ ఆదేశించింది. టీఎస్ డీజీపీకి ఆదేశాలు ఇవ్వడంతో పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

Next Story