వేసవి కాలం ప్రారంభమై ఎండలు ముదురుతున్న నేపథ్యంలో పాఠశాలలను ఒంటిపూట నడపాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అకడమిక్ క్యాలెండర్ ప్రతియేటా మార్చి 15 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించేవారు. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులు, ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 9,10 తరగతులు, ఫిబ్రవరి 24 నుంచి 6,7,8 తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో క్లాసులు ప్రారంభించారు.
ఇటీవలే విద్యార్థులకు బోధన ప్రారంభం కావడం, వసతులు సరిపోకపోవడంతో 2500 పాఠశాలలు షిప్ట్ పద్దతిలో తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే 200 పైగా పాఠశాలల్లో ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలు రెండు పూటలా నడిచే అవకాశం లేకపోవడంతో ఒంటిపూట నడపడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఒంటిపూట బడులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.