తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు అకాల వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడే ప్రమాదం ఉండటంతో అధికారులు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేశారు.
రేపు కూడా కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. అటు రాజధాని హైదరాబాద్లో సైతం నేడు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో తుపాను తరహా వాతావరణం నెలకొనే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అకాల మార్పుల దృష్ట్యా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అలాగే భారీ ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ కేంద్రం విజ్ఞప్తి చేసింది. ద్రోణి ప్రభావం మరియు గాలుల కలయిక కారణంగానే ఈ అకాల మార్పులు సంభవిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.