పాపం హాల్‌ టికెట్‌ పోయింది.. గ్రూప్-4 పరీక్ష రాయలేక..(వీడియో)

ఓ యువతి గ్రూప్‌-4 పరీక్ష కోసం సెంటర్‌కు వెళ్లింది. ఆమె తన హాల్‌టికెట్‌ మర్చిపోయింది.

By Srikanth Gundamalla  Published on  1 July 2023 8:09 AM GMT
Group-4 Exam, Telangana, Young Girl, Cry,  Exam Center

పాపం హాల్‌ టికెట్‌ పోయింది.. గ్రూప్-4 పరీక్ష రాయలేక..(వీడియో)

తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష రాస్తున్నారు అభ్యర్థులు. 8,180 ఉద్యోగ భర్తీకి నిర్వహించే పరీక్షకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జనరల్‌ స్టడీస్ పరీక్ష రాశారు. ఇక మ. 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెక్టరేరియల్‌ ఎబిలిటీస్‌ పరీక్షను రాయనున్నారు అభ్యర్థులు. అయితే గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తుంది. టీఎస్‌పీఎస్‌సీ పక్కా ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంది.

పరీక్షకు 15 నిమిషాల ముందే సెంటర్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు. దీంతో.. చెప్పిన సమయానికే పరీక్ష నిర్వాహకులు సెంటర్‌ గేట్లను మూసివేశారు. దాంతో.. పలువురు అభ్యర్థులు పరీక్షకు ఆలస్యంగా వెళ్లి నిరాశతో వెనుదిరిగారు. కొందరు గూగుల్‌ మ్యాప్‌ పెట్టుకుని పరీక్ష సెంటర్‌కు వస్తుండగా తప్పుడు లొకేషన్లు చూపించడంతో పరీక్ష రాయలేకపోయారు. ఇక మరికొందరు రవాణా సదుపాయంలో ఇబ్బందుల వల్ల ఆలస్యంగా వచ్చి పరీక్షకు హాజరుకాలేకపోయారు.

ఈ క్రమంలోనే హన్మకొండలో ఓ యువతి గ్రూప్‌-4 పరీక్ష కోసం సెంటర్‌కు వెళ్లింది. ఆమె తన హాల్‌టికెట్‌ మర్చిపోయింది. పైగా పది నిమిషాలు ఆలస్యంగా వెళ్లింది. దాంతో.. ఆమెకు పరీక్ష నిర్వాహకులు ఎగ్జామ్‌ హాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. ఎంతో కష్టపడి చదివింది కాబోలు.. ఇన్నాళ్ల శ్రమ అంతా వృధానేనా అని గేట్‌ దగ్గరే కూర్చొని బోరున విలపించింది. పోలీసులు, స్థానికులు ఎంత నచ్చజెప్పాలని చూసినా సదురు యువతి గేట్‌ను పట్టుకుని ఏడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు హాల్‌టికెట్‌ ఆన్‌లైన్‌లో చూసి ఆమెను లోనికి పంపిస్తే సరిపోతుండే కదా అంటూ అభిప్రాయపడుతున్నారు.

Next Story